దేశంలో వరుసగా రెండో రోజు 20 వేల పైచిలుకు కరోనా కేసులు

  • నిన్న 20,038 కేసుల నమోదు
  • ఒక్క రోజులో 47 మంది మృతి
  • కోలుకున్న వారు 16, 994 మంది
దేశంలో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 20 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం ప్రకటించింది. మొన్నటితో పోలిస్తే  వంద కేసులు మాత్రమే తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 1,39,073 కి చేరుకుంది. క్రియాశీల రేటు 0.31గా నమోదైంది.

గత 24 గంటల వ్యవధిలో 16,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా మహమ్మారిని జయించారు. రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 47 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5, 25, 604కి చేరుకుంది. మరణాల శాతం 1.20 శాతంగా ఉంది. 
ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 199,47,34,994 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న కొత్తగా 18,92,969 డోసులు అందజేశారు.

Corona Virus
COVID19
daily cases
vaccine

More Telugu News